నేనే సిఎంనైతే: అఖిలేష్కు ములాయం మళ్లీ మొట్టికాయ
శాంతిభద్రతల విషయంలో అఖిలేష్ విఫలమయ్యారన్నారు. సరిగ్గా పని చేయని జిల్లా స్థాయి అధికారులను దారిలోకి తేవాల్సి ఉందన్నారు. పని చేయకుంటే జైలుకు పంపాలని హితవు పలికారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కబెట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లా ప్రశంసలు అందుకోవాలంటే అందుకు కేవలం పదిహేను రోజులు చాలన్నారు. అఖిలేష్కు పాలన విషయంలో తానెప్పుడు అడ్డు తగలలేదన్నారు.
సలహాలు, సూచనలు మాత్రమే చేశానన్నారు. యూపిఏ 2 వార్షిక విందుకు ఇటీవల ఆయన హాజరు కాలేదు. దీనిపై మాట్లాడుతూ... యూపిఏలో లేనప్పుడు అలాంటి విందులకు హాజరయ్యే ప్రసక్తి లేదని చెప్పారు. ములాయం గతంలోను ఒకటి రెండుసార్లు తన తనయుడి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతేడాది అఖిలేష్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ములాయం సింగ్ యాదవ్ పలు సూచనలు చేశారు. తీరు మార్చుకోవాలని చెప్పారు. మీ పని తీరు బాగోలేదని, ఇలాగైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్లు సాధించలేదమని, ఇప్పటికైనా గాడిన పడాలని సొంత ప్రభుత్వానికే ములాయం సింగ్ హెచ్చరికలు చేశారు. ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రతిష్ఠను పెంచే చర్యలు చేపట్టాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు.
మంగళవారం రాత్రి పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్.. తన పాలనపై మొదటిసారిగా, అదీ తన తండ్రి నుంచే విమర్శలు ఎదురుకావడంతో.. అప్పుడు ఏమీ చెప్పలేకపోయారు. మొత్తానికి తండ్రి వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ములాయం అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని, పొరపాట్లు ఉంటే దిద్దుకుంటామని అఖిలేశ్ చెప్పారు. బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ స్పందించినప్పుడు కూడా అఖిలేష్ పైన ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు.