అంకిత్ సరెండర్: శిల్పా శెట్టికి షాక్, రాజస్థాన్ రద్దు?
అంకిత్ చవాన్ ముంబై నుంచి ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. బెయిల్ గడువు ముగిసిపోవడంతో ఆయన గురువారంనాడు లొంగిపోయాడు. కాగా, అంకిత్ చవాన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
ఇలా వుంటే, తాజా పరిణామాల నేపథ్యంలో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహ యజమానులుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రద్దు కావచ్చుననే ప్రచారం సాగుతోంది. రాజ్ కుంద్రా బెట్టింగ్లో పాల్గొన్నాడనే ఢిల్లీ పోలీసు కమిషనర్ ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆ దిశగా ఆలోచన చేస్తోంది.
బిసిసిఐ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై కుంద్రాపై వచ్చిన ఆరోపణలపై చర్చించి, ఫ్రాంచైజీ యజమానులతో జరిగిన ఐపియల్ ఒప్పంద అతిక్రమణ జరిగిందా, లేదా అని పరిశీలించి రాజస్థాన్ రాయల్స్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐపియల్ లేదా జట్టు ప్రతిష్టను దెబ్బ తీసినట్లు వ్యవహారాలు నడిచాయనే భావిస్తూ ఫ్రాంచైజీని రద్దు చేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ పోలీసు కమిషనర్ ప్రకటనను బట్టి బిసిసిఐ నిర్ణయం తీసుకుంటుందా అనేది చెప్పలేని పరిస్థితే. అయితే, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంపై పోలీసులు బిసిసిఐకి తగిన సమాచారం అందిస్తారా, లేదా అనేది కూడా చెప్పలేం. రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలలను పోలీసులు మే 16వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.