సొంత జట్టుపైనే రాజ్కుంద్రా బెట్టింగ్స్: శిల్పా శెట్టి అప్సెట్
బెట్టింగుకు పాల్పడినట్లుగా రాజ్ కుంద్రా విచారణలో అంగీకరించారని ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. ఆయన మీద అనుమానం వచ్చే తాము విచారణకు పిలిచామని, బెట్టింగుకు పాల్పడినట్లు ఆయన అంగీకరించారని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు.
తన వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయెంకా ద్వారా బెట్టింగు చేసిన కుంద్రా పెద్ద ఎత్తున నష్టపోయినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీ పోలీసులు గురువారం ఉమేష్ గోయంకాను ప్రశ్నించనున్నారు. రాజ్ కుంద్రాను కూడా మరోసారి ప్రశ్నించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రాజ్ కుంద్రా కోర్టు ద్వారా అరెస్టు అయ్యే చేసే అవకాశాలున్నాయని ఆంగ్ల టివి ఛానల్స్లో వస్తున్నాయి. పోలీసులు కుంద్రా పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్లు గత నెలలో అరెస్టైన విషయం తెలిసిందే. మరోవైపు తన భర్త రాజ్ కుంద్రా పైన మీడియాలో వస్తున్న వార్తల పైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి అప్సెట్కు గురైన విషయం తెలిసిందే. ఉమేష్ గోయెంకా తన భర్త రాజ్ కుంద్రా పేరును మిస్ యూస్ చేశాడని శిల్పా ట్వీట్ చేశారు.