ఛీ కొడతారనే: కెసిఆర్పై టిడిపి, జగన్ ప్రభావంపై బాబు
తెరాసను, కెసిఆర్ను నమ్ముకోవడం కంటే చావే గతి అన్నారు. కెసిఆర్ ఓ బకాసురుడు అన్నారు. వలస వెళ్లిన నేతలను తెలంగాణవాదులు నమ్మొద్దన్నారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడతారనే కెసిఆర్ నాగరాజు మృతదేహాన్ని చూసేందుకు కూడా వెళ్లలేదన్నారు. కెసిఆర్ రాజకీయాలకు ఓ అమాయక యువకుడు బలయ్యారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిపై దూళిపాళ్ల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని ఆరోపించారు. కళంకిత మంత్రులను కాపాడేందుకు కిరణ్ ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారన్నారు. తన పాలనలో తప్పులు ఎత్తి చూపించిన వారిని బర్తరఫ్ చేస్తున్నారని విమర్శించారు. జగన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా కిరణ్ సహకారముందన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్, తెరాసలపై చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలు నియోజకవర్గాల కార్యకర్తలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెరాస కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమని, అది అన్ని జిల్లాల్లో ప్రభావం చూపలేదన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమలో రెండున్నర జిల్లాలకే పరిమితమైందని, ఉత్తరాంధ్రలో ఉనికే లేదని, కోస్తాంధ్రలో ప్రభావం తగ్గిందని చెప్పారు. 294 జిల్లాల్లో టిడిపి ఉందని, కాబట్టి వచ్చే ఎన్నికలలో టిడిపియే గెలుస్తుందని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.