ట్విస్ట్: బదిలీ ఉత్తర్వులు అందలేదన్న సిబిఐ జెడి
వృత్తిరీత్యా తనకు ప్రయోజనం కలిగిందని ఆయన అన్నారు. పదోన్నతి వల్లనే తనకు గతంలో పొడిగింపు వచ్చిందని ఆయన చెప్పారు. కేసుల వల్ల పొడిగింపు జరగలేదని, నిబంధనల వల్ల పొడిగింపు వచ్చిందని ఆయన అన్నారు. తన బదిలీ ప్రభావం కేసుల దర్యాప్తుపై పడదని ఆయన అన్నారు. కోర్టు అనుమతిస్తే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మహారాష్ట్ర కేడర్కు బదిలీ అయినట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. ఆయన మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపియస్ అధికారి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో మరో ఆరు చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయాల్సిన స్థితిలో ఆయన సొంత క్యాడర్కు బదిలీ అయ్యారని భావించారు. ఈ నెల 11వ తేదీ మంగళవారంనాడు సిబిఐ హైదరాబాద్ విభాగం జెడిగా పదవీబాధ్యతల నుంచి తప్పుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.
లక్ష్మినారాయణను బదిలీ చేస్తూ ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై సిబిఐ జాయింట్ డైరెక్టర్ అరుణాచలానికి బాధ్యతలు అప్పగించాలని లక్ష్మినారాయణకు ఆదేశాలు అందాయని అన్నారు. కానీ, లక్ష్మినారాయణ ప్రకటన బదిలీపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
లక్ష్మీనారాయణ 2006లో హైదారాబాద్ సిబిఐకి వచ్చారు. రెండు సార్లు ఆయన పదవీకాలాన్ని పొడగించారు. ఏడేళ్లు ఆ పదవిలో డిప్యుటేషన్పై పనిచేశారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసు దర్యాప్తుతో ఆయన పేరు వ్యాప్తిలోకి వచ్చింది. అత్యంత ముఖ్యమైన కేసుల దర్యాప్తును ఆయన చేపట్టారు. ఓబుళాపురం మైనింగ్ కేసుతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్, వైయస్ జగన్ ఆస్తుల కేసుల దర్యాప్తు ఆయన నేతృత్వంలో జరిగింది.
సత్యం కుంభకోణం కేసు దర్యాప్తునకు కూడా ఆయనే నేతృత్వం వహించారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో ఆయన విమర్శలను కూడా ఎదుర్కున్నారు. ఒక వర్గం మీడియాకు ఆయన లీకులు ఇస్తున్నారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు ఐదు చార్జిషీట్లను కోర్టుకు సమర్పించారు. మరో ఆరు అంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది. వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు కూడా పూర్తయిందని, చార్జిషీట్లు కూడా రూపొందించారని, వాటిని కోర్టుకు సమర్పించడమే ఉందని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు దర్యాప్తులు ఇప్పటికే ముగిశాయి.
జెడి బదిలీని ఆపాలని పిటిషన్ సిబిఐ జెడి లక్ష్మినారాయణ బదిలీని ఆపాలని కోరుతూ కుటుంబ రావు అనే సామాజికవేత్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు సిబిఐ హైదరాబాద్ జెడిగా లక్ష్మినారాయణను కొనసాగించాలని ఆయన కోర్టును కోరారు.