టిడిపి నేతల ఆందోళన, అరెస్ట్: బాధలేదని ద్వారంపూడి
టిడిఎల్పీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న టిడిపి నేతలు తమకు లోనికి అనుతించక పోవడంతో అక్కడే బైఠాయించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎపిపిఎస్సీ ప్రక్షాళనపై హామీ ఇచ్చేదాకా పోరాడుతామన్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. తాము అసెంబ్లీలో దీనిని లేవనెత్తుతామన్నారు. ఈ ఆందోళనలో మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.
బాధగా లేదు: ద్వారంపూడి
తన పదవి పోయినందుకు తనకు ఎలాంటి బాధలేదని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆదివారం కాకినాడలో అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల కోసం పోరాడే తాను నాలుగేళ్లకే మాజీ ఎమ్మెల్యే అయినందుకు ఎటువంటి బాధ లేదన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరిస్తాని ఆయన తెలిపారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నాడు వైయస్ రాజశేఖర రెడ్డి మండుటెండలో పాదయాత్ర చేపట్టారని, నేడు ఆయన కుమార్తె షర్మిల అదే పాదయాత్రను కొనసాగిస్తున్నారన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఎండకాలం రాకుండానే పాదయాత్ర పూర్తి చేసి ఎసి గదికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బాబు ఇప్పుడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెడితే కచ్చితంగా వీగిపోతుందని ద్వారంపూడి చంద్రశేఖర్ వెల్లడించారు. ఇప్పుడు పదవి పోయినా జగన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మంచి పాలన అందిస్తామన్నారు.