హోం గీతారెడ్డికి, రోడ్లు పితానికి: ఎదురుపడ్డ బాబు, నాగం
బ్రాహ్మణయ్య మృతికి సంతాపం
అంబటి బ్రాహ్మణయ్య విలువలతో కూడిన రాజకీయం చేశారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులు, పేదల సమస్యలపై నిరంతరం పోరాడారన్నారు. నీతి, నిజాయితీలకు నిలువుటద్దం అంబటి బ్రాహ్మణయ్య అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. బ్రాహ్మణయ్య ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన కుటుంబం నిరాడంబరంగా ఉందని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆయన పేరు శాశ్వతంగా ఉండేలా గ్రంథాలయం స్థాపించాలని, విగ్రహం పెట్టాలని ఇతర పార్టీల శాసనసభ్యులు కోరారు.
సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యాక కొద్ది రోజుల క్రితం మృతి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతికి సంతాపం తెలిపారు. రైతు సమస్యలపై బ్రాహ్మణయ్య రాజీలేని పోరాటం చేశారని, నీతికి, నిజాయితీకు ఆయన నిలువుటద్దమని, పెనుమూడి వారధి ఆయన కృషి వల్లనే వచ్చిందని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యారంగానికి ఎనలేని కృషి చేశారని, బ్రాహ్మణయ్య పేరు శాశ్వతంగా నిలిచేలా ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బాబు కోరారు. అంబటి బ్రాహ్మణయ్య మృతికి సంతాపం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
ఎదురుపడ్డ నాగం, బాబు
తెలంగాణ కోసమంటూ తెలుగుదేశం పార్టీని వీడి ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డికి శాసనసభ ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదురయ్యారు. వారిద్దరు నవ్వుతూ ఒకరికొకరు పలకరించుకున్నారు. సమావేశాలకు డిఎల్ రవీంద్రా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి గైర్హాజరయ్యారు.