భార్యను చూసి నేర్చుకోవాలి: దగ్గుబాటిపై టిఎస్సార్
కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో తనకు ఏ విధమైన శత్రుత్వం లేదని, తన పరువు తీసేందుకు ప్రయత్నించడం వల్లనే బాధగా ఉందని ఆయన అన్నారు. తనపై చేసిన విమర్శలకు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పది రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.
ఉద్దేశ్యపూర్వకంగానే దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను బట్టే ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయని ఆయన అన్నారు. విశాఖపట్నం పార్లమెంటు సీటు విషయంలో దగ్గుబాటి పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు తలదూర్చి టిఎస్సార్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
సోమవారం టి. సుబ్బిరామిరెడ్డి దగ్దుబాటి వెంకటేశ్వర రావుకు లీగల్ నోటీసులు పంపించారు. దగ్గుబాటి తనపై ఇటీవల చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని 12 అంశాలతో కూడిన నోటీసును దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు పంపించారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని దగ్గుబాటి చెప్పారు. అందిన తర్వాత సమాధానం చెబుతానన్నారు.