బాధిస్తోంది: అస్త్ర సన్యాసంపై అద్వానీ, రిజైన్ తిరస్కరణ
తాను ఇక నుండి పార్టీలో సాధారణ కార్యకర్తలా పని చేస్తానని అన్నారు. పార్టీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కొందరు వ్యక్తిగత అజెండాతో పని చేయడం బాధిస్తోందన్నారు. ప్రస్తుతం పార్టీ తీరుతో సర్దుకుపోలేకపోతున్నానన్నారు. తొలితరం నేతల ఆశయాలు పార్టీలో ఇప్పుడు కొనసాగడం లేదన్నారు. దీనదయాళ్, నానాజీ, అటల్ బిహారీ వాజపేయిలు నిర్మించిన పార్టీలా లేదన్నారు. శ్యామ్ప్రసాద్ ముఖర్జీ వంటి తొలి తరం నేతల ఆశయాలు పార్టీలో కొనసాగడం లేదన్నారు.
అద్వానీ రాజీనామా లేఖ పూర్తి పాఠం....
ప్రియమైన పార్టీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్జీ
నా రాజకీయ జీవితమంతా జన సంఘ్, భారతీయ జనతా పార్టీ కోసమే పని చేశా. అందుకు నేను గర్వపడుతున్నా. ఇది నాకు సంతృప్తినిచ్చింది. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న విధానాలపై సర్దుకుపోలేకపోతున్నాను. పార్టీ ఏ దిశలో వెళ్తుందో అర్థం కావడం లేదు. నేతల ఆశయాలు కొనసాగడం లేదు.
డాక్టర్ ముఖర్జీ, దీన్ దయాళ్, నానాజీ, వాజపేయిల ఆశయాలు కనిపించడం లేదు. వారు దేశం కోసం పరితపించారు. ప్రస్తుతం ఎక్కువ మంది నాయకులు వ్యక్తిగత అజెండా కోసమే పని చేస్తున్నారు. పార్టీలో జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల సంఘ కమిటీ పదవులకు రాజీనామా చేస్తున్నానను. దీన్నే రాజీనామాగా భావించి ఆమోదించగలరు.
ఇట్లు మీ భవదీయుడు అద్వానీ.
బుజ్జగింపులు
అద్వానీని బుజ్జగించే పనిలో బిజెపి అధిష్టానం, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు పడ్డారు. రాజీనామా నేపథ్యంలో ఆయన ఇంటికి భారీగా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. కాగా, అద్వానీ రాజీనామను రాజ్నాథ్ సింగ్ తిరక్సరించారు. అద్వానీ రాజీనామా బాధాకరమని, ఉపసంహరణపై ఆయనకు నచ్చజెప్తామని సుష్మా స్వరాజ్ చెప్పారు. అద్వానీ ఇంటికి వికె మల్హోత్రా, అనంత కుమార్, సుధీంద్ర కులకర్ణి, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు తదితరులు వచ్చారు. అద్వానీ రాజీనామా దురదృష్టకరమని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది.
పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లిన నేత: శరద్ యాదవ్
అద్వానీ నిర్ణయం తనను బాధించిందని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఉన్నత శిఖరాలకు వ్యక్తి అద్వానీ అన్నారు. ఆయన ముందు చూపున్న నేత అని, ఈ వ్యవహారంపై త్వరలో జెడి(యు) సమావేశమవుతుందని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఇది ఎన్డీయేకు మేలు చేయదన్నారు. అద్వానీ లేని ఎన్డీయేలో ఉండమన్నారు.
పార్టీ అంతర్గత విషయం: చంద్రబాబు
అద్వానీ, నరేంద్ర మోడీల అంశం బిజెపి అంతర్గత విషయమని, దానిపై తాను స్పందించనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.