బలిపశువును చేశారు: బిసిసిఐపై రాజ్ కుంద్రా గరం
ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు ఏ విధమైన ఆధారాలు లేకుండా తనపై అన్ని రకాల ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. కచ్చితమైన వాస్తవాలు లేకుండా తనను బలిపశువును చేశారని, రుజువు కాని విషయాలపై తనను మీడియా ముందు విచారణకు పెట్టారని ఆయన అన్నారు.
భారతదేశంలో క్రీడల అభివృద్దికి తాను కట్టుబడి పనిచేశానని, తనపై చేసిన ఆరోపణలకు తాను గాయపడ్డానని ఆయన అన్నారు. క్రీడలపైనే తనకు మొదటి ప్రేమ ఉంటుందనే విషయం తనను ఎరిగినవారందరికీ తెలుసునని, రాజస్థాన్ రాయల్స్లో తనకు 11.7 శాతం మైనారిటీ వాటా మాత్రమే ఉందని, మెజారిటీ వాటా సూపర్ ఫైట్ లీగ్దని ఆయన చెప్పారు.
భారతదేశంలో కొద్ది మంది మాత్రమే క్రీడల అభివృద్ధిపై చొరవ చూపి, విజయం సాధించారని, క్రీడల పట్ల తన నిజాయితీని ప్రశ్నించడంతో తన మనసు గాయపడిందని, ఈ విధమై అవినీతి దేశంలో విదేశీయుల పెట్టుబడులకు ఆటంకం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
శిల్పా శెట్టి దేశం విడిచి రావడానికి సిద్ధంగా లేదని, శిల్పాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తాను భారతదేశానికి రావాలని అనుకున్నానని, అయితే కొద్ది కాలంలోనే తనకు భారత్ పట్ల ప్రేమ పెరిగిందని ఆయన అన్నారు.