శ్రీశాంత్, అంకిత్లకు బెయిల్: చండిల జైలులోనే
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లకు కోర్టులో ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన ఇద్దరు క్రికెటర్లకు సోమవారం ఢిల్లీలోని మోకా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారితో పాటు మొత్తం 19 మందికి స్పాట్ ఫిక్సింగ్ కేసులో బెయిల్ మంజూరైంది.
బెయిల్ మంజూరైనవారిలో బుకీ జిజూ జనార్దన్ కూడా ఉన్నాడు. మోకా అభియోగం నాన్ బెయిలబుల్ కిందికి వస్తుంది. పోలీసులు నిందితులను 30 రోజుల పాటు కస్టడీకి తీసుకోవచ్చు. అంతేకాకుండా, ఢిల్లీ డిసిపి ముందు గానీ, ఇతర రాష్ట్రాల్లోని ఎస్పీ ముందు గానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సాక్ష్యాలుగా కోర్టు అంగీకరిస్తుంది.
స్పాట్ ఫిక్సింగ్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్ర గురించి కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఇది వరకు చెప్పారు. దావూద్కు ఫోన్లు చేసినవారిలో పెద్దలు కూడా ఉండవచ్చునని భావించారు. బెయిల్ లభించిన 19 మంది ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి రేపు విడుదలవుతారు.
పాస్పోర్టులను తమకు స్వాధీనం చేయాలని కోర్టు నిందితులను ఆదేశించింది. మోకా ప్రయోగించడానికి వారిపై పోలీసులు తగిన సాక్ష్యాధారాలను చూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. అజిత్ చండిల మాత్రం జైలులోనే ఉండిపోవాల్సి వస్తుంది. అతను బెయిల్కు దరఖాస్తు చేసుకోలేదు. శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లను పోలీసులు మే 16వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.