బొగ్గుల పులిని కాదు, నేను బొబ్బిలి పులిని: దాసరి
తనపై కుట్రలో భాగంగానే తనపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణంలో నిజానిజాలు త్వరలో బయటపడుతాయని ఆయన అన్నారు. ఆందోళన చెందవద్దని ఆయన తన అభిమానులను కోరారు. దాసరి నారాయణ రావుకు చెందిన కంపెనీలోకి జిందాల్ గ్రూప్ నుండి రూ.2.25 కోట్లు వచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దాసరి మంత్రిగా ఉన్న సమయంలో బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో బాగంగా మంగళవారం సిబిఐ అధికారులు దాసరి నారాయణ రావు నివాసంలో సోదాలు నిర్వహించారు.
కోల్గేట్ కేసులో దాసరి, నవీన్ జిందాల్ పేరులను సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దాసరి నివాసంలో, కార్యాలయాల్లో ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పూర్తయ్యాయి. 2008వ సంవత్సరంలో జిందాల్ గ్రూప్కు, దాసరి కంపెనీకి మధ్య ఒప్పందు కుదిరినట్లుగా చెబుతున్నారు. దీంతో దాసరి కంపెనీలోకి అంత పెద్ద మొత్తం హామీలేని రుణంగా వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.
దాసరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న సమయంలో నవీన్ జిందాల్ గ్రూప్కు ఐదు బొగ్గు గనుల కేటాయింపులు జరిగాయి. జిందాల్ గ్రూప్ మొత్తంగా 7 బొగ్గు గనులను పొందింది. బొగ్గు గనుల కేటాయింపుల అవకతవకల సమయంలో దాసరితో పాటు సంతోష్ బగ్రోడియా కూడా సహాయ మంత్రిగా ఉన్నారు. దాసరిని తొమ్మిది గంటలు ప్రశ్నించిన సిబిఐ కాగా బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ 120బి, రెడ్ విత్ 420, 13(1)(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన నాలుగు ప్రయివేటు కంపెనీలు(గగన్ స్పాంజ్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ తదితర నాలుగు కంపెనీలు), హైదరాబాదుకు చెందిన సౌభాగ్య కంపెనీ పైన కేసును నమోదు చేశారు.
జార్ఖండ్లోని అమరకొండ ముర్గదంగాల్ కోల్ బ్లాకుల కేటాయింపులో అవతకవకల ఆధారంగా కేసు నమోదు చేశారు. జిందాల్ తప్పుడు పత్రాలతో కోల్ బ్లాక్లు పొందినట్లుగా సిబిఐ గుర్తించింది. దాసరి కంపెనీలో జిందాల్ పెట్టుబడులు పెట్టినట్లుగా సిబిఐ గుర్తించినట్లుగా తెలుస్తోంది.