నా అరెస్టు కుట్ర కావచ్చు, ఫిర్యాదులు లేవు: శ్రీశాంత్
కొచ్చి: భారత్ తరఫున మళ్లీ క్రికెట్ ఆడుతానని పేసర్ శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి బెయిల్పై విడుదలై ఆయన తన సొంత ఊరికి చేరుకున్నారు. తాను తప్పు చేయలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను క్రికెట్ ఆడాలని కలలు కంటున్నానని, క్రికెట్ ఆడడమే తన వాంఛ అని, జాతీయ జట్టులోకి రావడమే తన లక్ష్యమని ఆయన అన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లో తాను ఆడాలని అనుకుంటున్నానని, అయితే ఇప్పుడే ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని అన్నాడు. త్రిపునిథురలో తల్లిదండ్రులను, బంధువులను కలిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు.
తన తల్లిదండ్రుల వద్దకు చేరుకోవడం తనకు ఆనందాన్నిస్తోందని, త్వరలోనే శిక్షణను ప్రారంభిస్తానని చెప్పాడు. కేసులో మిమ్మల్ని ఇరికించారని భావిస్తున్నారా అని అడిగితే - తాను ఏ తప్పూ చేయలేదని, తన అరెస్టు కుట్రలో భాగం కావచ్చునని, త్వరలోనే బయటపడుతానని, మంచి జరుగుతుందనే ఆశ ఉందని సమాధానమిచ్చాడు.
తీహార్ జైలులో అనుభవం గురించి అడిగితే ఆ విషయం వివరించడం ఇష్టం లేదని జవాబిచ్చాడు. తాను క్రికెట్ను ప్రేమిస్తానని, తాను ఆడడం ప్రారంభిచినప్పటి నుంచి అత్యుత్తమంగా ఆడాలని ప్రయత్నించానని ఆయన అన్నారు. ఇది నమ్మండి అని అన్నాడు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. సమస్య పరిష్కారమైన తర్వాత అన్ని విషయాలు వివరిస్తానని అన్నాడు.
క్రికెట్ క్రీడారంగం నుంచి తనకు పూర్తి మద్దతు లభించిందని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్కు, బిసిసిఐకి, మిత్రులకు, తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మీడియాకు ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. ఎవరి మీదా తనకు ఫిర్యాదులు లేవని అన్నాడు. ప్రతి ఒక్కరూ తమ తమ విధిని నిర్వహిస్తున్నారని అన్నాడు.
ఓ కారణం వల్ల జరిగిందేదో జరిగిందని, ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని శ్రీశాంత్ అన్నాడు. తన బెయిల్కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు అపీల్ చేయనున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించాడు.