జగన్, కెసిఆర్ మీడియాలకు నో ఎంట్రీ: చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం తరపున నిర్వహించే మీడియా సమావేశాలకు తమ రాజకీయ ప్రత్యర్థులైన జగన్, కెసిఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించరాదని, తమ కార్యాలయాలలోకి వారిని అనుమతించరాదని, ఈ సంస్థల చర్చా గోష్టుల్లో నేతలు ఎవరూ పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నారు.
'సాక్షి పత్రిక, సాక్షి చానల్, టీ న్యూస్ చానల్ ఆయా పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయని, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నాయని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారు. తాము ఏం చెప్పినా రాయరు...చూపించరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సమావేశం తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు.
ఇదిలావుంటే, రైతాంగ సమస్యలపై గన్పార్క్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు బుధవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో రైతాంగం కుదేలైందని చంద్రబాబు మండిపడ్డారు. కౌలు రైతులకు రుణసహాయం అందడం లేదని విమర్శించారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.