బావ బ్రదర్ అనిల్ కుమార్ను జగన్ దూరంగా ఉంచారా?
క్రైస్తవ ప్రబోధనలతో నిత్యం బిజీగా ఉండే అనిల్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటూ గతంలో ప్రచారం కూడా సాగింది. జగన్ సోదరి, అనిల్ సతీమణి షర్మిల దాదాపు తొమ్మిది నెలలుగా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఆమె పాదయాత్ర ప్రారంభించిన కొత్తలో అనిల్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని, రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించేందుకు ఆయన అప్పుడు దేశ, విదేశాలలోని పర్యటనలు కూడా రద్దు చేసుకున్నట్లు ప్రచారం కూడా సాగింది.
ఆ తర్వాత ఆయన రాజకీయ ఆరంగేట్రంపై ఎలాంటి వార్తలు రాలేదు. అయితే కొద్దికాలంగా అనిల్ను జగన్ దూరంగా ఉంచుతున్నట్లుగా సమాచారం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మతపరమై రాజకీయ విమర్శలు వచ్చాయి. విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకోవడం తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. తద్వారా జగన్ పార్టీకి మతపరమైన రంగు పులిమే ప్రయత్నం జరిగింది.
ఈ నేపథ్యంలో మత బోధనలు చేసే అనిల్ కుమార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి క్రియాశీలకంగా మారినా, ఆయన ఇక్కడున్నా మరిన్ని రాజకీయ విమర్శలు వస్తాయని భావించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను ప్రస్తుతానికి ఇక్కడ ఉంచకుండా వేరే చోటికి పంపించి ఉంటారని అంటున్నారు.