అసెంబ్లీ: సిఎంకు ఆజాద్ ఫోన్, కెసిఆర్పై జగ్గారెడ్డి పైర్
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ డిమాండ్ కెసిఆర్ వల్ల వచ్చింది కాదని, గత యాభై ఏళ్లుగా ఈ డీమాండ్ ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గత 50 ఏళ్ల కాలంలో ప్రజలు నమ్మి అనేక మంది నాయకులకు అవకాశం కల్పించారని, అయితే వారు స్వలాభం కోసం వాడుకున్నారని ఆయన అన్నారు.
చట్టసభల్లో మాట్లాడే అవకాశం లేని పార్టీలు చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు చేపడుతాయని, శాసనసభలోనూ పార్లమెంటులోనూ మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ తెరాస చలో అసెంబ్లీని చేపట్టిందని ఆయన అన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకంగా లేరని ఆయన అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలను వేదికలుగా చేసుకుని తెలంగాణ సాధిస్తామని కెసిఆర్ గతంలో చెప్పారని, కెసిఆర్ పార్లమెంటుకు సరిగా వెళ్లరని, తెలంగాణపై మాట్లాడరని ఆయన అన్నారు.
పార్లమెంటులో తెలంగాణపై కెసిఆర్ ఎన్నిసార్లు మాట్లాడారని ఆయన అడిగారు. కెసిఆర్ స్వలాభం కోసం ఉద్యమాన్ని అడ్డం పెట్టుకున్నారని ఆయన విమర్శఇంచారు. అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఉంటుందనే ముఖ్యమంత్రి శానససభా సమావేశాలను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. దాన్ని తెరాస సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. తెరాస రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నించకుండా తెలంగాణను ఊబిలా తయారు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మాట్లాడకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మంచి మాటలు చెప్పినా తెరాస నాయకులు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.