కార్లో నేతల్ని అసెంబ్లీ వైపు తీసుకెళ్లి శంకరన్న హల్చల్
బిజెపి, తెరాస మహిళా నాయకురాళ్లు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇదే సమయంలో అటు నుండి అసెంబ్లీ వైపుకు వస్తున్న శంకర రావు మహిళా నాయకులు, కార్యకర్తలను తన వాహనంలో ఎక్కించుకున్నారు. వారిని అసెంబ్లీకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులను దాటుకొని శంకర రావు బషీర్ బాగ్ చౌరస్తా వరకు వచ్చారు. అక్కడ మాత్రం పోలీసుల నుండి తప్పించుకోలేక పోయారు.
శంకర రావు కారులో వివిధ జెండాలు ధరించిన నాయకులు ఉండటంతో పోలీసులు వారిని కిందకు దించారు. వారి ప్రయత్నాన్ని శంకర రావు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వేర్వేరు జెండాలు ధరించి ఉండటంతో వారు అసెంబ్లీ ముట్టడికే ఆయన కారులో వెళ్తున్నారని పోలీసులు భావించారు. వారిని పోలీసులు కిందకు దించారు. వారు అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా శంకర రావు మాట్లాడారు. తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి, పోలీసు అధికారులతో బాధ్యత అన్నారు. తెలంగాణవాదుల పైన కాకుండా వారి పైనే కేసులు పెట్టాలన్నారు. చలో అసెంబ్లీ సందర్భంగా ఎవరైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలైనా ముఖ్యమంత్రిపై చర్యలకు తీసుకోవాలని పిల్ వేస్తానని చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు.