బొత్స మాటేమిటి?, బాబుకు నిజాలు గిట్టవు: షర్మిల
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చీకటి ఒప్పందం ఉండడం వల్లే బాబు ఆస్తులపై ఎటువంటి విచారణలు జరగడం లేదని విమర్శించారు. కేంద్రం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట వినలేదని తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు.
‘స్థానిక ఎన్నికలు వస్తున్నాయి.. మనకు క్యాడర్ లేదని కాంగ్రెస్, టిడిపిలు ప్రచారం చేస్తున్నాయి. దేవుని దయ.. జన బలం ఉంది. విజయం మనదే. అవి స్థానిక ఎన్నికలైనా కావచ్చు.. మరే ఎన్నికలైనా కావచ్చు. వైయస్సార్ కాంగ్రెస్కి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషి అని చాటిచెబుతుంది. జగనన్న బయటకురావడానికి బాటలు వేస్తుంద'ని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికలలో విజయం మనదే అన్నారు.
నారా చంద్రబాబు నాయుడుకు నిజాలు అంటే భయమని అన్నారు. అందుకే నిజాలు రాసే సాక్షి మీడియాను ఆయన బహిష్కరించారన్నారు. చంద్రబాబు వైఖరి అద్దాన్ని చూసి ముఖం పగులగొట్టుకున్నట్లుగా ఉందన్నారు. సాక్షిని బహిష్కరించడం చంద్రబాబు చేసిన ఘోర ద్రోహమని, ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోక తప్పదన్నారు.