హైటెన్షన్: ఇటు సమావేశాలు.. అటు చలో అసెంబ్లీ
సభలో జై తెలంగాణ
శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో జై తెలంగాణ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని టిడిపి, తెరాస సభ్యులు చుట్టుముట్టారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.
నగరంలో 144వ సెక్షన్
చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 144వ సెక్షన్ విధించారు. హైదరాబాదులో పదిహేడు, సైబరాబాదు పరిధిలో 58 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నగరంలోని అసెంబ్లీ వైపుకు వెళ్లే పలు ఫ్లై ఓవర్లను మూసివేశారు. అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల వరకు పూర్తిస్థాయి నిషేధాజ్ఢలు అమలు చేస్తున్నారు. శాంతిభద్రతల కోసం దాదాపు ముప్పైవేల మంది పోలీసులు మోహరించారు. నగరంలో 190 ప్లటూన్ల ఎపిఎస్పీ పోలీసు, 20 కంపెనీల సెంట్రల్ పారామిలటరీ దళాలను మోహరించారు. అసెంబ్లీ దగ్గర డిజిపి భద్రతను పరిశీలిస్తున్నారు.
అసెంబ్లీ వద్ద పలువురు తెలంగాణవాదులు తచ్చాడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాసనమండలి సభ్యుడు స్వామి గౌడ్ను, సిపిఐ, బిజెపి, తెరాస నేతలను పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. తెలంగాణవ్యాప్తంగా 12వేల మందిని పోలీసులు నిర్బంధించారు. హైదరాబాదులో పలుచోట్ల ట్రాఫిక్ను మళ్లించారు.
ముఖ్యంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణవాదులు అడ్డుకుంటారనే భయంతో దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చారని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చలో అసెంబ్లీకి రాలేని వారు ఎక్కడికక్కడ రహదారులు దిగ్బంధించి, జైల్ భరోలో పాల్గొనాలని సూచించారు.