టిఆర్ఎస్ఎల్పీ భవనమెక్కిన ఎమ్మెల్యేలు, కవిత అరెస్ట్
మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ భవనం ఎక్కేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు మెట్లు మూసివేశారు. దీంతో తెరాస ఎమ్మెల్యేలు బెంచీల పైనే తమ లేచి నిలబడి తమ నిరసన తెలిపారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ, సిపిఐ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తెలంగాణ నేతలు నిత్యం సభను అడ్డుకుంటుండంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
అంతకుముందు అసెంబ్లీ వైపుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.. భారీగా కార్యకర్తలతో ఆమె వచ్చారు. పోలీసులు కవితను అరెస్టు చేశారు. బిజెపి నేత విద్యాసాగర రావును పోలీసులు అసెంబ్లీకి తరలి వస్తుండగా అశోక్ నగర్ వద్ద అరెస్టు చేశారు.
మరోవైపు రవీంద్ర భారతి నుండి తెరాస ఎమ్మెల్యేలు పలువురు అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఎంపీలు వివేక్, మంద జగన్నాథం, నేతలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ ఎమ్మెల్యేలు గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై పడుకొని మంత్రుల కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కిరణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మరోవైపు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల పోడియం వద్దనే ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ లోపల విద్యుత్ నిలిపివేయడంతో టిటిడిపి ఎమ్మెల్యేలు చీకట్లోనే తమ నిరసన తెలియజేస్తున్నారు.