సిబిఐ జెడిగా బాధ్యతలు స్వీకరించిన అరుణాచలం
శనివారం లక్ష్మీ నారాయణ స్థానంలో కొత్త జాయింట్ డైరెక్టర్ అరుణాచలం బాధ్యతలను స్వీకరించారు. డిప్యుటేషన్ కాలం ముగియడంతో లక్ష్మీ నారాయణ ఈ నెల 11న సొంత కేడర్ మహారాష్ట్రకు వెళ్లిపోయారు. దీంతో చెన్నై సిబిఐ జెడి అరుణాచలం రాష్ట్ర సిబిఐ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.
ఆయన విదేశీ పర్యటనలో ఉండటంతో డిఐజి వెంకటేష్కు బాధ్యతలు అప్పగించి లక్ష్మీ నారాయణ వెళ్లిపోయారు. ఈ నెల 17న అరుణాచలం బాధ్యతలు స్వీకరిస్తారని ముందుగా వార్తలు వచ్చినా ఆయన శనివారమే హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయానికి వచ్చి విధుల్లో చేరారు.
అయితే మీడియాతో మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. జగన్ ఆస్తులు, గాలి గనుల దోపిడీలాంటి సంచలన కేసుల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తుచేసిన లక్ష్మీ నారాయణకు విశేష ప్రాచుర్యం లభించింది. కాగా, కొత్త జెడి అరుణాచలం రాష్ట్రంలో రాజకీయాలతో పెనవేసుకున్న కేసుల్లో ఆయన ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.