నిద్రిస్తున్నారా?: చిరుపై దేవినేని, ఛాన్సివ్వండి: శంకరన్న
ఎపిపిఎస్సీ అక్రమాలపై తెలుగుదేశం, విత్తనాలు, ఎరువుల కొరతపై వైయస్సార్ కాంగ్రెసు, అక్రమ అరెస్టులు, కేసులపై భారతీయ జనతా పార్టీ, మగ్ధూం భవనం మీద పోలీసుల దాడిపై సిపిఐ, విఆర్ఎల సమస్యలపై సిపిఎం, తెలంగాణపై తీర్మానం, చలో అసెంబ్లీ అరెస్టులపై తెలంగాణ రాష్ట్ర సమితిలు సభాపతికి తీర్మానాలను ఇచ్చాయి. వాటిని తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభ వాయిదా పడింది.
ఫ్లోర్ లీడర్లతో సమావేశం
సభ నిత్యం వాయిదా పడుతున్న నేపథ్యంలో సభాపతి నాదెండ్ల మనోహర్ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. తాము స్పీకర్కు రాసిన లేఖపై సమాధానం చెప్పే వరకు తాము ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హాజరయ్యే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ చెప్పింది. వారు భేటీకి దూరంగా ఉన్నారు.
తెరాసకు జూలకంటి సూచన
చలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగిన అరెస్టులపై చర్చించాలని లేదా తమను సస్పెండ్ చేయాలని తెరాస ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయాల్సి వస్తే సిపిఐ, బిజెపి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందన్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టులపై మంగళవారం సభలో ప్రకటన చేస్తామని ప్రభుత్వం చెప్పింది. చలో అసెంబ్లీ అరెస్టులపై రేపు ప్రకటన చేస్తామని ప్రభుత్వం చెప్పినందున తెరాస ఆ తర్వాత ఆలోచించుకోవాలని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. దానికి తెరాస ఎమ్మెల్యేలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
శాసనసభలో తనకు మాట్లాడే అవకాశమివ్వాలని మాజీ మంత్రి శంకర రావు సభాపతిని కోరారు. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం, ఎర్ర చందనం అక్రమ తరలింపు, డిజిపి ఆస్తుల వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
చిరుపై దేవినేని ఫైర్
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలని టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవాసులు ప్రమాదంలో చిక్కుకుంటే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు.