భారీ వర్షాలు: ఉత్తరఖండ్లో చిక్కుకున్న ఆంధ్రా భక్తులు
చిక్కుకుపోయిన వారిలో హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలవాసులు ఉన్నారు. చిన్నలు, పెద్దలు, మహిళలు అందరు ఉన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో వందలాది వాహనాల రాకపోకలు రెండు రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయని అన్నపానాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే చార్ ధామ్ యాత్ర ముగించుకుని రుషీకేశ్ వంటి ప్రాంతాలకు చేరుకున్నవారు సైతం.. ఢిల్లీకి చేరుకుని అక్కణ్నుంచి రాష్ట్రానికి రావాలన్నా భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చార్ధామ్ యాత్రకు వెళ్లే మార్గం పొడవునా పిప్లామండీ, బారాకీ, నాలుపానీ.. ఇలా పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన బస్సుల్లోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు.
ఏ క్షణాన తాము ఉన్న ప్రాంతంలో ఏ కొండచరియ విరిగిపడుతుందోనని ప్రాణాలు అరచేత పట్టుకుని కాలం గడుపుతున్నారు. సెల్ఫోన్ల ద్వారా వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పలువురు అధికారులతో మాట్లాడుతున్నారు. ఫోన్స్ ఛార్జింగ్ చేసుకునేందుకు వీలులేకపోవడంతో భక్తులు సెల్ ఫోన్స్ను స్విచ్చాఫ్ చేసి అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేస్తున్నారు.
వర్షాలతో గంగానది పరవళ్లు తొక్కుతుండటంతో ఉత్తర కాశీలో ఆంధ్రా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వరద ఉధృతి పెరగడంతో సత్రాలపై నుండి కొండల పైకి ఎక్కారు. హెలికాప్టర్ తప్ప బయటపడే అవకాశం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి, కిరణ్ ఆరా
ఉత్తర కాశీలో చిక్కుకున్న ఆంధ్రా భక్తులతో నల్గొండ జిల్లా కలెక్టర్ మాట్లాడారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకు వస్తామని ఉత్తరాఖండ్ అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర పర్యాట శాఖ మంత్రి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. చిరంజీవి ఉత్తరాంచల్ ముఖ్యమంత్రితో మాట్లాడారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీతోను మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కూడా అక్కడి ప్రభుత్వాధికారులతో మాట్లాడి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.