తెలంగాణపై ఎర్రబెల్లి సవాల్: బాబుపై గీతారెడ్డి తీవ్రవ్యాఖ్య
కాంగ్రెసు, టిఆర్ఎస్ కుమ్మక్కై సభ జరగకుండా చేస్తున్నాయన్నారు. తెలంగాణను ఇచ్చి ఇక్కడి ప్రజలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభినందనలు పొందాలన్నారు. ఎవరు కుమ్మక్కయ్యారో, ఎవరు అడ్డుకుంటున్నారో చర్చించేందుకు సిద్ధమన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్హౌస్లో పడుకున్నారని, పార్లమెంటు ఎదుట ఎందుకు ధర్నా చేయడం లేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిని కిరణ్ ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. కెసిఆర్ వైఖరి వల్లే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
గండ్ర కౌంటర్
కాంగ్రెసు తెలంగాణకు కట్టుబడి ఉందని, సభ సజావుగా నడవాలనే తాను అన్ని పార్టీల నేతలను కలిశానని, సభలో లేని సోనియా గాంధీ ప్రస్తావన ఎందుకని గండ్ర వెంకటరమణ రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబుపై గీతా రెడ్డి
చంద్రబాబు నాయుడుపై గీతారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా టిడిపి సభ నుండి వాకౌట్ చేసింది. కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేసింది. దానిపై గీతా రెడ్డి స్పందించారు. తాము కళంకితులమైతే చంద్రబాబు కూడా కళంకితులేనని ఆమె మండిపడ్డారు. తమను కళంకితులన్నందుకు టిడిపిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తమపై సిబిఐ అభియోగాలు ఉంటే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కానీ చంద్రబాబు తమపై అభియోగాలపై కోర్టుల నుండి స్టే తెచ్చుకున్నారన్నారు. బాబు సిబిఐ అభియోగాలపై స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టిడిపికి తమను కళంకితులనే హక్కు లేదన్నారు. సిబిఐ అభియోగాలున్న, ధైర్యంలేక స్టే తెచ్చుకున్న బాబు ఆధ్వర్యంలో వీరు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. టిడిపి ధైర్యం లేని పార్టీ అన్నారు. గీతారెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ టిడిపి వాకౌట్ చేసింది.
ఆత్మగౌరవం దెబ్బతీశారు: పోచారం
తమను సస్పెండ్ చేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని తెరాస శాసన సభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో తమను సస్పెండ్ చేశారన్నారు. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సొమ్ము మాది.. సోకు మీదా అని ప్రశ్నించారు. తమను సస్పెండ్ చేసిన ఈరోజు బ్లాక్ డే అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ సిపిఐ సభ నుండి వాకౌట్ చేసింది.
రాజకీయ ప్రయోజనాలొద్దు: జెపి
రాజకీయ ప్రయోజనాల కోసం సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని లోక్సత్తా అధ్యక్షుడు, కూకట్పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. సభ నడిపేందుకు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలికమైన సభా సంప్రదాయాలను మనం కోల్పోయామన్నారు. సభలో చర్చల ద్వారా ఉద్దేశ్యాలు బయట పెట్టాలే తప్ప సభను అడ్డుకోవడం సరికాదన్నారు.