ఫాంహౌస్లో కెసిఆర్: జెఏసి లేఖ, టి కాంగ్రెస్ తర్జన భర్జన
చలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగిన అరెస్టులు, నిర్బంధంపై బందుకు పిలుపునిచ్చి ఫాంహౌస్లో ఎందుకున్నారో చెప్పాలని లేదంటే తాము ఫాంహౌస్ను ముట్టడిస్తామని వారు లేఖలో హెచ్చరించారు. తెలంగాణ కోసం ఉన్నారా? లేక తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఉన్నారా? చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణపై టి కాంగ్ నేతల తర్జన భర్జన
తెలంగాణపై అధిష్టానాన్ని మెప్పించే ఉద్దేశ్యంలో భాగంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు నేతలు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందరం కలిసి కట్టుగా ఉండాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నేతలు తీర్మానం చేశారు. తెలంగాణ ఏర్పాటు చేయకుంటే కాంగ్రెసుకే నష్టమని వారు అన్నారు.
తెలంగాణపై వెనక్కి తగ్గవద్దని, తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉండాలన్నారు. పోటీకి దూరంగా ఉంటే మంచిదని దామోదర రాజనర్సింహ చెప్పారు. పదవులు వదులుకుంటే అధిష్టానం దిగి వస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. వారి వ్యాఖ్యలతో గీతారెడ్డి సహా పలువురు నేతలు విభేదించారు. కేంద్రం ఇచ్చిన మాటపై నిలబడి ఉండాలని, పదవులు వదులుకుంటే విలువుండదని అన్నారు. ఈ నెల 30వ తేదిన భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలని నేతలు తీర్మానం చేశారు. దిగ్విజయ్ సింగ్ నియామకాన్ని స్వాగతిస్తూ.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. ఢిల్లీ పర్యటన తేదిని జానా రెడ్డికి వారు అప్పగించారు.