జగన్, సిఎంలపై గాలి వ్యాఖ్యలు: తిప్పికొట్టిన కన్నా
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. జగన్కు, కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధం అంటగడుతూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ రికార్డుల నుంచి తొలగించారు. బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి సభ్యులను సస్పెండ్ చేశారని నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
శాసనసభ్యుడు పి. శంకరరావు వేసిన పిటిషన్ మేరకు జగన్పై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఏ సంతకం చేయని జగన్ జైలులో ఎందుకు ఉంటాడు, జీవోలపై సంతకాలు చేసిన మంత్రులు బయట ఎందుకు ఉంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అడుగుతున్నారని, అదే విషయాన్ని తెలుగుదేశం సభ్యులు ప్రస్తావిస్తున్నారని, జగన్ పార్టీ వాదనను తెలుగుదేశం పార్టీ మోస్తోందని ఆయన అన్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు గాలి మాటలు మాట్లాడుతారని, కాంగ్రెసులో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టిపోశారని ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని వివిధ కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఏ విషయంలో చంద్రబాబు విచారణను ఎదుర్కున్నారని ఆయన అడిగారు. చంద్రబాబు తప్పుకుని పారిపోయి తాను నీతిమంతుడ్ని అని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ అవినీతి సొమ్ములో ఎంత తీసుకుని మాట్లాడుతున్నారని ఆయన తెలుగుదేశం సభ్యులను ప్రశ్నించారు.
చంద్రబాబుపై గాలి ముద్దుకృష్ణమ నాయుడికి ఏదో కోపం ఉన్నట్లుందని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. మైక్ దొరికితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, న్యాయవ్యవస్థలో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుంటే జైలుకు వెళ్తారని తీర్పు చెబుతున్నారని ఆయన అన్నారు. అందరినీ రెచ్చగొట్టి గాలి ముద్దుకృష్ణమనాయుడు చంద్రబాబు కొంప ముంచేట్లున్నారని ఆయన అన్నారు.