కెటిఆర్పై కుట్ర: హరీష్, బెదిరించలేదని నిర్మాత సురేష్
ఎబిఎన్ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపై విషం కక్కుతోందన్నారు. ఇది కెటిఆర్ పైన దాడి కాకుండా.. ఉద్యమం పైన దాడిగా చూస్తున్నామన్నారు. ఆంధ్రా మీడియా ఎన్ని కుట్రలు చేసినా ఉద్యమ ప్రభావం ఏమాత్రం తగ్గదన్నారు. తెరాసపై బట్ట కాల్చి వేయాలనుకోవడం సరికాదన్నారు. టిడిపిని పైకి తెచ్చేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు, టిఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు ఎబిఎన్ ఇలా చేస్తోందన్నారు.
చంద్రయాన్ పేరుతో చంద్రబాబు జనం లేని పాదయాత్రను జనం ఉన్నట్లుగా చూపించారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛతో ఇలా చేయడం సరికాదన్నారు. ఇది రాజకీయ కుట్రగా తాము భావిస్తున్నామన్నారు. సెటిల్మెంట్లతో కెసిఆర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎబిఎన్ కథనం ఏకపక్షంగా ఉందని, పన్నెండేళ్లుగా తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు ఇప్పటి వరకు రుజువు కాలేదన్నారు.
ఎబిఎన్ బెదిరించలేదు: నిర్మాత సురేష్ బాబు
ఎబిఎన్ ఆంధ్రజ్యోతికి చందిన వారు తమను డబ్బు కోసం బెదిరించలేదని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చెప్పినట్లుగా స్క్రోలింగ్ వచ్చింది. ఎవరో గిట్టని వారు అవాస్తవాలు చెప్పడం బాధాకరమన్నారు. ఎబిఎన్ రాధాకృష్ణతో తమకు ఎప్పటి నుండో పరిచయముందన్నారు. తమ అబ్బాయి విషయంలో డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు అవాస్తవమన్నారు. ఉదయం టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. గతంలో ఓ నిర్మాతను రాధాకృష్ణ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారనే వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.