కిరణ్, చిరు వర్గం మంత్రులపై సంతకాలు, వద్దన్న బొత్స
సి.రామచంద్రయ్య, మహీధర్ రెడ్డిలను మంత్రివర్గం నుండి తప్పించాలని, వారి పని తీరు అసంతృప్తిగా ఉందని సంతకాలు సేకరిస్తున్నారు. వీటిని వారు ముఖ్యమంత్రికి, పార్టీ అధిష్టానానికి ఇవ్వనున్నారు. మంత్రులుగా ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలను వారు పట్టించుకోవడం లేదని, పనులు చేయడం లేదని వారు అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల సంతకాల సేకరణ లాబీల్లో చర్చకు వచ్చింది.
ఎమ్మెల్యేలు కెఎల్ఆర్, వీరశివా రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, రౌతు సూర్యప్రకాశ రావు తదితరులు సంతకాల సేకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా సంతకాలు చేయిస్తున్న వారిలో చిరు వర్గం మంత్రి, కిరణ్ వర్గం మంత్రి ఉండటం గమనార్హం. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారిని వారిస్తున్నారట.
ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి, అధిష్టానానికి ఇస్తే వారేం చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిలో చిరు, కిరణ్ వర్గం వారు ఉన్నారు. వీరి సంతకాలతో వారిని తొలగించనప్పటికీ ప్రభావం మాత్రం ఉంటుందని అంటున్నారు.