సెటిల్మెంట్: ఆంధ్రజ్యోతి పేపర్, కెటిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
'త్యాగాల సెంటిమెంట్తో భోగాల సెటిల్మెంట్' అంటూ కెటిఆర్ భూదందా అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కొన్నిచోట్ల ఉదయాన్నే మేల్కొని, పత్రికలు ఏజెంట్ల చేతికి చేరకముందే బండిళ్లను ఎత్తుకెళ్లి తగులబెట్టారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, కరీంగనర్ జిల్లా మంథని, మెదక్ జిల్లా చేగుంట, రామాయంపేటలో బండిళ్లను తగులబెట్టి తమ నిర్వాకం చాటుకున్నారు.
పలుచోట్ల పత్రిక ప్రతులను దహనం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ సమీపంలోని అగ్రసేన్ విగ్రహం వద్ద పత్రిక ప్రతులను దహనం చేశారు. నగరంలోని పలుచోట్ల కూడా ఇలాగే ప్రతులను దహనం చేశారు. వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ అక్కడక్కడ కార్యకర్తలు పత్రిక ప్రతులను దహనం చేశారు.
మరోవైపు సెటిల్మెంట్లకు పాల్పడుతూ, బెదిరింపులకు దిగుతున్న కెటిఆర్ను అరెస్టు చేయాలంటూ కరీంనగర్ జిల్లా మల్యాలలో టిడిపి, బిజెపి, దళిత సంఘాల కార్యకర్తలు ధర్నా చేశారు. మల్లాపూర్, మెట్పల్లిలో కెటిఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కెటిఆర్ దందాపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.