ఉత్తరఖండ్ ప్రకృతి విపత్తు: 550 మందికిపైగా మృతి
డెహ్రడూన్: హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఉత్తరఖండ్ రాష్ట్రంలో జరిగిన పెను విపత్తులో 550 మందికి పైగా మరణించారు. మొత్తం 556 మంది మరణించారు. శుక్రవారం మరో 40 మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాదంలో 556 మంది మరణించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరో 15 రోజులు పడుతుందని బహుగుణ చెప్పారు. అది కూడా వర్షాలు మళ్లీ రాకపోతేనే అని అన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 34 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. షిండే శనివారం వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కేదార్నాథ్ ప్రాంతం పూర్తిగా విధ్వంసానికి గురైంది. గౌరీకుండ్, కేదార్నాథ్ మధ్య నీళ్లలో తేలుతూనో, బురదలో కూరుకుపోయో పలు మృతదేహాలను ఐటిబిపి కనిపెట్టినట్లు విజయ్ బహుగుణ చెప్పారు.
ఉత్తరాఖండ్లోని యాత్రికులందరినీ రెండు రోజుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, సహాయక చర్యలు శనివారంనాటికి పూర్తవుతాయని ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటిబిపి) చీఫ్ అజయ్ చద్దా చెప్పారు. వాతావరణం మెరుగు కావడంతో సహాయక చర్యలు ముమ్మరమైనట్లు ఆయన తెలిపారు.
బద్రీనాథ్కు బ్రిడ్జి కనెక్టివిటీని ఏరపాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేదార్నాథ్ నుంచి యాత్రికులందరినీ తరలించామని, ఎవరూ అక్కడ మిగిలి లేరని చెప్పారు. యాత్రికులనే కాకుండా స్థానికులను కూడా తరలిస్తున్నట్లు తెలిపారు. సమాచారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్కు 145 కోట్ల రూపాయల రిలీఫ్ ప్యాకేజీని మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి మనీష్ తివారీ చెప్పారు.