తెలంగాణ ఎగ్గొట్టి, ప్యాకేజ్: కెసిఆర్, జగన్ పైనా వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎగ్గొట్టినట్టేనని, ప్యాకేజీ ప్రకటన ఈ నెల 30 లోపు రావచ్చని చెప్పారు. అదే సమయంలో ప్యాకేజీపై తెలంగాణ కాంగ్రెస్ కేడర్లో విముఖత తప్పదని, దాన్ని ఒడిసిపట్టుకోవాలని సూచించారు. తద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకును తెరాస వైపు మళ్లించాలన్నారు. ప్యాకేజీకి వ్యతిరేకంగా జెఏసి పక్షాలు ఎవరికి వారుగా వివిధ రూపాల్లో వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని నిర్దేశించారట.
ఈసారి ప్రభుత్వ నిర్బంధం తీవ్రంగా ఉంటుందని, పిడి యాక్ట్, అరెస్ట్లకు దొరకకుండా నిరసనలకు రూపకల్పన చేసుకోవాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు కొందరు అవసరమైతే రాజీనామా చేసి, పూర్తిస్థాయిలో పనిచేయటానికి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ లాభంలేదని, ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవటమే ఉత్తమ మార్గమని సూచించినట్లుగా తెలుస్తోంది.
కాగా, ఎన్నికల కు పార్టీ అభ్యర్థుల పేర్లను జూలైలోనే ప్రకటిస్తామని కెసిఆర్ తెలిపారు. వర్షాలు తగ్గాక 40-50 లక్షలమందితో హైదరాబాద్ శివార్లలో దాదాపు 500-600 ఎకరాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ఎన్నికల భేరి మోగిస్తామన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు.
బిజెపితో పొత్తు కుదరదని, రేపు కేంద్రంలో కాంగ్రెస్కు మెజార్టీ రాకపోయినా, చిన్న పార్టీలను కలుపుకొని మోడీని అధికారంలోకి రాకుండా చేస్తుందని, మోడీ వస్తే, ఇక రాహుల్ ఎప్పుడూ అధికారంలోకి రాడనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉందని, అందుకే పొత్తుల్లేకుండా పోటీ చేస్తామని చెప్పారు. 10-12 ఎంపీ స్థానాలు వస్తే, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ అడిగే శక్తి పెరుగుతుందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోనహ్ రెడ్డికి శిక్షపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, దీనివల్ల ఆ పార్టీ నష్టపోతే కాంగ్రెస్ లాభపడుతుందే తప్ప టిడిపి కాదని చెప్పారు. ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో తమ మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడవని చెప్పారు.