వరదలు: చెట్టుపైనే మూడ్రోజులు యువతి, భాషే సమస్య
హైదరాబాద్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బాధితులు తమ భయానక అనుభవాలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర కాశీలో దాదాపు నాలుగున్నర వేల మంది తెలుగు వారు చిక్కుకుపోయారు. ఇప్పటికే పలువురు ఇళ్లకు చేరుకున్నారు. వారు వరదల్లో చిక్కుకున్నన్ని రోజులు ప్రాణ భయంతోనే గడిపారు. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఓ మహిళ మూడు రోజుల పాటు చెట్టు పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంది.
భారీగా వరద నీరు వస్తుండంటంతో ఆమె చెట్టు కొస వరకు ఎక్కింది. అక్కడే ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ మూడు రోజులు గడిపింది. ఆ తర్వాత భారత జవాన్లు ఆమెను రక్షించారు. వరద పోటెత్తడంతో దారులన్నీ మూసుకుపోయాయని, దాంతో తామంతా ఎత్తైన గుట్ట పైకి ఎక్కామని, వరద ఉద్ధృతి తగ్గడంతో కిందకు దిగామని, రోడ్లు ధ్వంసం కావడంతో రెండు రోజులు బస్సులోనే గడిపామని మరో యాత్రికుడు చెప్పారు.
కొందరు శవాల గుట్టల మధ్య జాగారం చేయగా, ఒకరు తన భార్య, ఇతరులు తన కళ్ల ముందే వరదలో కొట్టుకుపోతుండే నిస్సహాయంగా నిలిచిపోయారు. చిన్నారులను, వృద్ధులను రక్షించబోయిన వారు కొట్టుకుపోయారు. గుట్టల్లో, కొండల్లో చిక్కుకు పోయిన బాధితులు ఇటు వరద నీరు, అటు కొండచరియలు పడుతుండటంతో భయం గుప్పిట్లో గడిపారు. అక్కడున్నాన్నాళ్లూ నిద్ర, తిండి లేకుండా గడిపారు.
కాగా, చార్ ధామ్ యాత్రకు మన రాష్ట్రం నుండి దాదాపు నాలుగున్నర వేల మంది వెళ్లినట్లుగా తెలుస్తోంది. అందులో దాదాపు రెండు వేల మంది తిరిగి వచ్చారు. ఎపి భవన్, రుషికేశ్లలో ఆరేడు వందల మంది ఉన్నారు. భాష రాక, నడవ లేక, బేస్ క్యాంపుల్లో మరికొంత మంది ఉన్నారు. మన వారికి భాష సమస్యగా నిలిచింది. తరలింపులో ఉత్తరాది వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.