ఎవరికీ నష్టం లేని పరిష్కారం: తెలంగాణపై విజయమ్మ
ఆమె తెలంగాణలోని పది జిల్లాల్లో ఈ రోజు నుండి పది రోజుల పాటు పర్యటిస్తారు. ఆమె మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగిన సభలో ప్రసంగించారు. ముందుగా ఆమె తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణవాదాన్ని నాడు వైయస్, నేడు జగన్ గౌరవిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ రకమైన ఛార్జీలు పెంచలేదని, ఆయన చెప్పినట్లుగా ఉచిత విద్యుత్ ఇచ్చారన్నారు. నేటి ప్రభుత్వం మూడు గంటల విద్యుత్ కూడా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు. వైయస్ మృతి తర్వాత రైతులు, రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.
అవిశ్వాసం సమయంలో చంద్రబాబు కాంగ్రెసు ప్రభుత్వానికి అండగా నిలిచారని విమర్శించారు. చంద్రబాబుకు వ్యవస్థలను, మీడియాను మేనేజ్ చేయడం బాగా తెలుసునన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. కిరణ్ సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. అందరం కలిసికట్టుగా కుమ్మక్కు రాజకీయాలు ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
బెల్టు షాపును పరిచయం చేసింది బాబే: ప్రవీణ్ రెడ్డి
దేశానికి బెల్టు షాపులను పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి వేరుగా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సిగ్గుపడేవిధంగా మద్యం పాలసీని తీసుకు వచ్చారన్నారు. డబ్బులు దండుకోవడానికే ఈ విధానమన్నారు.
సానుకూల నిర్ణయం: షబ్బీర్ అలీ
తెలంగాణపై త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ నెల 30వ తేదిన జరిగే సభను విజయవంతం చేస్తామన్నారు. తమకు సోనియా గాంధీ పైన నమ్మకముందన్నారు.