మతం మారితే కులం ఉండదు: యువతి కేసులో హైకోర్టు
"ఒక వ్యక్తికి వెనుకబడిన కులం అనేది పుట్టుకతో వస్తుందే తప్ప, అది సామాజిక హోదా కాదు. మతం మారడం ద్వారా అంతకు ముందున్న కుల ముద్ర నుంచి సదరు వ్యక్తి విముక్తుడవుతాడు'' అని న్యాయమూర్తి తెలిపారు. అలాగే ఒక మతంలో అగ్ర కులంలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ఇతర మతంలోకి మారి, తనకూ వెనకబడిన తరగతుల జాబితాలో అవకాశాలు ఇవ్వాలంటే కుదరదని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు.
దీనికి అనుమతిస్తే, వెనుకబడిన తరగతులు అన్న విధానానికి అర్థమే ఉండదన్నారు. ఒక వ్యక్తి మతం మారి, పాత మతంలోని కులం కొనసాగాలని కోరలేడని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా న్యాయమూర్తి ఈ సందర్భంగా ఉటంకించారు. అలాగే మతం మారిన వారికి కులం లేదని 1952లోనే మద్రాస్ హైకోర్టు ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుత కేసుకు సంబంధించి పిటిషనర్ యాస్మిన్ వెనుకబడిన తరగతికి చెందిన క్రిస్టియన్ నాడార్ కుటుంబంలో జన్మించింది. ఈమె ఇస్లాం స్వీకరించి, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. 2012లో గ్రూపు-4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అప్పటికే ఆమెకు 30 ఏళ్లు నిండాయి. అయితే రిజర్వేషన్ కేటగిరీ కింద వయసులో ఐదేళ్ల సడలింపు ఆధారంగా రాత పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. కాగా, క్రిస్టియన్ నుంచి ఇస్లాం మతంలోకి మారినందున ఆమెను 'ఇతర తరగతులు(ఓసీ)' కేటగిరీలోకి మారుస్తామని, అందువల్ల రిజర్వేషన్ వర్తించదని కౌన్సెలింగ్ అధికారులు స్పష్టం చేయడంతో యాస్మిన్ హైకోర్టును ఆశ్రయించింది.