తెలంగాణ, విదర్భ రాష్టాలు చేయాల్సిందే: సంగ్మా
నాగూపూర్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఆ రెండు రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అమెరికాలో మాదిరిగా భారతదేశంలో 50 రాష్ట్రాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ, విదర్భ రాష్ట్రాలను ఏర్పాటు చేసి, హరితప్రదేశ్, బుందేల్ ఖండ్, తదితర ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లపై శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్రాల రెండో పునర్వ్యస్థీకరణ సంఘాన్ని (రెండో ఎస్సార్సీని) ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
విదర్భ ప్రాంత అధ్యయనం కోసం తనతో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసినప్పుడు తాను కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేశానని, సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సిద్ధపడ్డారని, అయితే కొంత మంది అంత తొందరపాటు తగదని సలహా ఇవ్వడంతో ఆగిపోయిందని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో ఏర్పాటు చేసిన నేషనల్ పీపుల్స్ పార్టీని మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.