చెక్కుచెదరని కేదార్నాథ్: 4 వందల ఏళ్లు మంచు కింద
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వరదల ధాటికి పెద్ద పెద్ద భవంతులు, భారీ వాహనాలు కొట్టుకుపోయాయి. వంతెనలు, రహదారులు తెగిపోయాయి. ఇంత బీభత్సం జరిగినా కేదారీనాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. పటిష్ఠమైన నిర్మాణం వల్లనే ఆలయం చెక్కుచెదరలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కేదార్నాథ్ ఆలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాలు గతంలో పూర్తిగా మంచులోనే కూరుకుపోయినప్పటికీ ఏమీ కాలేదని, అలాగే ఇప్పుడు ఈ వరదలకు దెబ్బతినలేదని, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రీస్తు శకం 1300-1900 మధ్య కాలంలో ఆలయం మంచులో కూరుకుపోయిందని చెప్పారు.
ఈ కాలంలో భూమి మీద చాలా ప్రాంతాలు మంచుకిందే కమ్ముకుపోయాయని, అందులో కేదార్నాథ్ ఆలయం కూడా ఉందన్నారు. అప్పుడు ఆలయానికి ఏమీ కాలేదన్నారు. ఆలయానికి ఉన్న పటిష్టత వల్లనే వరదలు నష్టం కలిగించలేక పోయాయంటున్నారు. మంచు, రాళ్లు, బురదతో కూడిన హిమనీనదం మెల్లిగా కదులుతూ ఉంటుందని, ఈ మేరకు దాని ప్రభావం కేదార్నాథ్ ఆలయంపై ఇప్పటికీ కనిపిస్తుందని చెబుతున్నారు.
నాలుగు వందల ఏళ్లు మంచు కింద ఉన్నప్పుడు ఆలయానికి ఏమీ కాలేదని, ఇప్పటి వరదల్లో చెక్కు చెదరకపోవడం తమను ఆశ్చర్యానికి గురి చేయలేదని అంటున్నారు. ఆలయం గోడలపై ఉన్న పసుపు గీతలు ఉన్నాయని చెప్పారు. కాగా, ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను లిచెనోమెట్రిక్ డేటింగ్ అనే టెక్నాలజీ ద్వారా పరిశోధకులు అధ్యయనం చేశారు.