విభజనకు రెడీ: వసంత, ఇదే అఖరి పోరు: పొన్నాల
తెలంగాణ సాధన కల త్వరలో నెరవేరబోతోందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం ఉదయం ఆయన మెదక్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ఇదే ఆఖరి పోరాటమన్నారు. ఆదివారం జరిగే తెలంగాణ సభ ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో తెలంగాణ అనుకూల నిర్ణయం వస్తుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం జరిగే సభలో తెలంగాణపై తాము తీర్మానం చేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్ర సమైక్యతకు ముప్పేమీ లేదని సీమాంధ్రకు చెందిన మంత్రి బాలరాజు అన్నారు. ఈ విషయంపై రాష్ట్రానికి వస్తున్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్కు విన్నవిస్తామని ఆయన శనివారంనాడు మీడియాతో చెప్పారు.
హైదరాబాదులోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో రేపు(ఆదివారం) జరిగే తెలంగాణ సాధన సభను విజయవంతం చేయాలని మంత్రి జానారెడ్డి కోరారు. సభకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. శనివారం ఉదయం నిజాం గ్రౌండ్స్లో జరుగుతున్న తెలంగాణ సాధన సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ పరిశీలించారు.