వరదలు: రూ.50 కోట్లు ప్రకటించిన కిరణ్ రెడ్డి ప్రభుత్వం
హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.10 కోట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నేరుగా ఇవ్వనున్నారు. మిగిలిన నలభై కోట్ల రూపాయలతో కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలలో భక్తుల వసతి గృహ సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం చార్ధామ్ క్షేత్రాల్లో వసతి భవనాల నిర్మాణానికి మిగిలిన ఈ రూ.40 కోట్లు కేటాయించారు. చార్ ధామ్లోని నాలుగు చోట్ల ఒక్కోచోట రూ.10 కోట్లతో భక్తులకు వసతి గృహాలు నిర్మించనున్నారు. చార్ ధామ్ యాత్రలో ప్రాణాలు కోల్పోయినవారి కుంటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
సచివాలయంలో సిఎస్ మహంతి సహా ఇతర ఉన్నతాధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఉత్తరాఖండ్లో ఉన్న తెలుగువారికి అందుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు. సహాయ చర్యల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జవాన్ యాదయ్య, జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వినాయకన్ కుటుంబ సభ్యులకురాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
మరోవైపు వరద బాధిత తెలుగువారి కోసం చేపట్టిన సహాయ కార్యక్రమాల వేగం పెంచడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్లో ఉన్న పార్టీ నేతలను ఆదేశించారు. అక్కడ ఉన్న తమ పార్టీ ఎంపీలు, వైద్య బృందాలతో శనివారం ఆయన నాలుగు గంటలకోసారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.