విభజించే హక్కు ఎక్కడిది?: శోభ, బాబు డిఎన్ఏపై పేర్ని
తెలంగాణ సమస్యను తీసుకు వచ్చింది కాంగ్రెసు పార్టీయేనని, పరిష్కరించాల్సింది ఆ పార్టీయే అన్నారు. సీమను విడదీసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమ ప్రాంతంలో తమ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుంటుందనే ఉద్దేశ్యంతోనే రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారని విమర్శించారు.
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని తామొక్కరమే ఆదుకున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని హైదరాబాదులో అన్నారు. అమెరికాకు వెళ్లిన బాబు ఆ విషయం మర్చిపోయేందుకే ఇదంతా చేశారన్నారు. టిడిపి కంటే తమ పార్టీయే వరద బాధితులను ఆదుకునేందుకు మొదట వెళ్లిందన్నారు.
టిడిపి అధికార పార్టీని నిలదీయాల్సింది పోయి తమ పార్టీ పైన నిందలు వేయడం సరికాదన్నారు. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ పార్టీది కాంగ్రెసు పార్టీ డిఎన్ఏనే అన్న కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పైన నాని స్పందించారు.
రాజకీయాల్లో ఎవరు ఎవరికీ డిఎన్ఏ కాదన్నారు. అలా అయితే చంద్రబాబు డిఎన్ఏ ఏమిటని, ఆయన ఏ పార్టీ నుండి వచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు భజన చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు 1999లో ఏ పార్టీ నుండి పోటీ చేసి గెలిచారో చెప్పాలన్నారు. జగన్ను చూస్తే కాంగ్రెసు, టిడిపిలు ఉలిక్కిపడుతున్నాయన్నారు.