పంచాయతీ ఎన్నికలు: రాములమ్మ కిడ్నాప్?
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంకు చెందిన మాడపాటి రాములమ్మ అనే మహిళ గత నెల 25వ తేది నుండి కనిపించడం లేదు. దీంతో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాములమ్మ ఉండే గ్రామం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ పార్టీల హవా ఉంటుంది. సిపిఐ, సిపిఎం పార్టీలు ఎవరికి వారు ఆమెను తమ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
మిగతా పార్టీలు కూడా ప్రయత్నాలు చేశాయి. అయితే అనూహ్యంగా గత నెల 25 నుండి ఆమె కనిపించడం లేదు. రాములమ్మ గ్రామంలో సర్పంచ్ గిరిజనులకు రిజర్వ్ అయింది. ఈమె గిరిజన యువతి. సమాచారం మేరకు ఈ గ్రామంలో ఉన్న గిరిజన మహిళ ఈమె ఒక్కరే. దీంతో సర్పంచ్ రాజకీయ లబ్ధి కోసమే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
మహబూబ్ నగర్లో ఒక్కరే..!
మహబూబ్ నగర్ జిల్లా లింగన్ పల్లిలో ఓ ఎస్టీ మహిళను అనుకోని విధంగా సర్పంచ్ పదవి వరించే అవకాశముంది. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి ట్రైబల్ మహిళకు రిజర్వ్ అయింది. అయితే ఈ గ్రామంలో ఒకే ఒక్క గిరిజన మహిళ ఉన్నారు. దీంతో ఆమెకే అవకాశముంది. ఈ గ్రామంలో ఆరువందలకు పైగా ఓట్లు ఉన్నాయి.