'పంచాయతీ' పోరు: మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన రమాకాంత్ రెడ్డి.. ఓటింగ్ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఉంటుందని, అదే రోజు ఓట్ల లెక్కింపు, గెలుపొందిన అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు. ఈ నెల 9న కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తారని, 13వ తేది నామినేషన్ల దాఖలుకు తుది గడువు అని, 14న స్క్రూటినీ ఉంటుందని, 17 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది అని చెప్పారు.
ప్రతి జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారిగా, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయన్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ రోజు నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగనున్నాయి. గ్రేటర్ హైదరాబాదులో కలపబోయే గ్రామాల్లో ఎన్నికల మినహాయింపు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 52 గ్రామాలలో ఎన్నికలను నిర్వహించటం లేదు.
కాగా, మొత్తం 21,491 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశలో 6,875, రెండో దశలో 7,795, మూడో దశలో 6,873 గ్రామాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ధరావతు మొత్తాన్ని పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నప్పటికీ జెడ్పీటిసి, ఎంపిటిసి అభ్యర్థుల ధరావతు, ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల వ్యయం గతంలో రూ.40 వేలు ఉండగా, ఇప్పుడు రూ.80 వేలు, ఎంపిటిసి అభ్యర్థి వ్యయం రూ.50 వేలు ఉండగా, ఇప్పుడు లక్ష రూపాయలు, జడ్పీటిసి అభ్యర్థి వ్యయం గతంలో రూ.1 లక్ష ఉండగా, ఇప్పుడు రెండు లక్షలకు పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పదివేలకు లోబడి ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రూ.40 వేలుగా ఉండాలని ప్రకటించింది.