కడపలో స్టార్ట్: సమైక్యాంధ్రకోసం ఎమ్మెల్యేల రాజీనామా!
కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు నారాయణ రెడ్డి, పుల్లయ్యలు రాజీనామా చేశారు. వారు స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామాలను సమైక్యాంధ్ర జెఏసికి ఇచ్చారు. ఈ భేటీలో పాల్గొన్న నేతలు సమైక్యాంధ్ర కోసం తాము పదవులు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో కంటే ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి వద్ద ఆందోళనలు చేపట్టాలని సదస్సులో తీర్మానం చేశారు. ఈ సమావేశానికి బ్రహ్మయ్య, గోవర్ధన్ రెడ్డి, అమీర్ బాబు తదితరులు హాజరయ్యారు.
సీమను విడదీసే హక్కు లేదు
రాయలసీమ ప్రాంతాన్ని విభజించే ప్రతిపాదన వచ్చిందని, దానిని వ్యతిరేకిస్తూ తాము రాజీనామాలను జెఏసికి ఇచ్చామని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమను విడదీసే హక్కు ఎవరికీ లేదన్నారు. సీమను విడదీస్తే తాము కూడా రాజీనామా చేస్తామని టిడిపి నేత లింగారెడ్డి ఫోన్లో చెప్పారన్నారు. విభజన పేరిట కాంగ్రెసు పార్టీ అధిష్టానం గందరగోళానికి గురి చేస్తోందన్నారు.