టెక్కీల్లో ఒత్తిడి, ఒంటరితనం: నిన్న నీలిమ...నేడు అశ్విని
గతేడాది జూలై 31న నీలిమ ఇన్ఫోసిస్ భవనం మధ్య అంతస్థు నుంచి దూకింది. ఈ ఘటనలో ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. ఆసుపత్రిలో చేర్పించేలోపే ఆమె మృతి చెందింది. నీలిమ మృతిపై పలు రకాల వాదనలు వినిపించాయి. మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇప్పుడు అశ్విని నిన్న జూలై 9న తాను పని చేస్తున్న కంపెనీకి చెందిన భవనం పై అంతస్థు నుండి దూకి మృతి చెందింది. ఆత్మహత్య చేసుకునేందుకు పైకి వచ్చిన అశ్వినిని అక్కడే పని చేస్తున్న ఆశాబీ అనే మహిళ అనుమానించింది. అశ్విని కిందకు దూకే సమయంలో వద్దంటూ వారించింది.
(క్రైసిస్: టెక్కీల జీవితాల్లో ఎందుకీ ట్రాజెడీలు?)
నీలిమ, అశ్విని ఇద్దరు ప్రతిభావంతులైన వారే. వారు వృత్తిపరంగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొన్నారు. కానీ వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోలేక మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. టెక్కీలకు లక్షల్లో జీతాలు, అయినా నిరాశ, నిస్పృహ ఎందుకు అనేది ప్రశ్నగా మారింది. అధిక మొత్తంలో జీతాలు పొందుతుండడం వల్ల ఆ సాఫ్ట్వేర్ రంగంలో జరుగుతున్న సంఘటనలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయా అనేది కూడా ప్రశ్నే.
భర్త, స్నేహితుడు, అమెరికాలో ప్రాజెక్టు పనులప్పుడు చోటు చేసుకున్న పరిణామాలో నీలిమను ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పాయనే వాదన ఉంది. చివరకు ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుందని దర్యాఫ్తులో నిర్ధారణ అయింది. అశ్విని కూడా ఒత్తిడి కారణంగానే చనిపోయింది.
ఆమె డైరీలో రాసుకున్న దాని ఆధారంగా చనిపోవాలని నిర్ణయించుకుంది. అశ్విని వ్యక్తిగత విషయానికి సంబంధించి సంఘర్షణకు లోనైనట్లుగా చెబుతున్నారు. ప్రేమలో విఫలమవడం, ఒత్తిడికి లోనవడం ఆమె ఆత్మహత్యకు కారణం కావొచ్చంటున్నారు. ఒత్తిడిలో ఉందని, కుటుంబ సభ్యులు ఎవరైనా తోడు ఉండాలని వైద్యులు సూచించారు.
వైద్యుల సూచనను పక్కకు పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. గతంలో నీలిమ తన ఈ మెయిల్స్లో కుటుంబ సభ్యులన ప్రస్తావిస్తే.. అశ్విని తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరింది.