టెక్కీ అశ్విని ఆత్మహత్య: ప్రేమ విఫలమైన ఒత్తిడివల్లే..?
విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అశ్వినీ జూన్ 24న ఒరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగంలో చేరింది. నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. ఆశ్వినికి చెందిన ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో సూసైడ్ నోట్ లభించింది. జీవితంపై విరక్తి చెంది, మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తల్లిదండ్రులు తనను క్షమించాలని కోరుతున్నానని.. ఆమె ఆ లేఖలో రాసినట్లు పోలీసులు చెప్పారు.
కాగా, అశ్విని గురించి ఆరా తీసిన పోలీసులు.. ప్రేమ విఫలమవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒక అంచనాకు వచ్చారు. బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు ఆమె తన సహాధ్యాయి రవీష్ జిరోజీని ప్రేమించిందని తెలిసింది. ఆమె హైదరాబాద్ రావడం, అతడు ఉద్యోగరీత్యా ముంబైకి వెళ్లడం, ఇద్దరి మధ్య దూరం పెరగడంతో అశ్విని కొన్నాళ్లుగా మనస్తాపానికి గురయిందని, వైద్యచికిత్స పొందుతోందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అశ్విని ప్రేమ వ్యవహారంలో మానసిక ఒత్తిడికి గురికావడంతో నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స తీసుకుంటుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు నిశ్చయించుకున్నట్లు వైద్యులు గుర్తించారని, ఒంటరిగా ఉంచకూడదని తల్లిదండ్రులకు పదిరోజుల క్రితమే సూచించారని పోలీసులు చెప్పారు.