వర్షంలోను ఆగని షర్మిల: బొత్స ఇలాకాలో ఫిర్యాదులు
విజయనగరం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాదయాత్ర విజయనగరం జిల్లాలో మూడో రోజు కొనసాగుతోంది. అలమండ, లొట్లపల్లి, బీమసింగి, తదితర గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఇది బొత్స ఇలాకా.
అయితే విజయనగరంలో ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనపై పలువురు స్థానికులు షర్మిలకు ఫిర్యాదులు చేశారు. బొత్స భీమసింగి సహకార చక్కెర కర్మాగారం సమస్యలు పరిష్కరించలేదని, మద్దతు ధర అందడం లేదని పలువురు రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. ఇక్కడ ఏం జరిగినా బొత్స కుటుంబానిదే హవా అని, వారి కనుసన్నుల్లో జరగాల్సిందేనని పలువురు ఆమెకు మొరపెట్టుకున్నారు.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ సభ్యులు సమాంతర పాలనను సాగిస్తున్నారని ఆరోపించారు. ఏడాదికోసారి జనసభలు అంటూ పెడతారని, వారు చెప్పేది వినాలంటారని, తాము ఏమీ అడకూడదంటారని ఆరోపించారు. చక్కెర ఫ్యాక్టరీలో సభ్యులుగా ఉన్న రైతులు ఆడపిల్లకు పెళ్లి చేస్తే రూ.10వేల ఆర్థిక సాయం ఇస్తానని బొత్స చెప్పినా, ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదని ఆరోపించారు.
భారీ వర్షంలో పాదయాత్ర
పాదయాత్ర 205వ రోజు బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని ఆలమండ నుంచి ప్రారంభమైంది. లొట్టపాలెం, ఏటపాలెం, కొత్తభీమసింగి, భీమసింగి మీదుగా షర్మిల యాత్ర చేశారు. ఈ సమయంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షంలో తడుస్తూనే షర్మిల కొంతమేర నడిచారు. ఆ తర్వాత వసంత గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఆమె రాత్రి 6.45 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 14 కిలోమీటర్లు నడిచారు.