గుట్టు విప్పు: చిరంజీవి అల్లుడు శిరీష్పై బిజెపి ఒత్తిడి
శిరీష్ భరద్వాజ్ ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ అంశంతో తెలంగాణ ప్రాంతంలో పాగా వేయాలని వ్యూహరచన చేసిన బిజెపి సీమాంధ్రలో శిరీష్ భరద్వాజ్ను వాడుకోవడం ద్వారా కాస్తా ప్రయోజనం పొందవచ్చునని చూస్తోందని అంటున్నారు. మెగా కుటుంబం గురించి శిరీష్ భరద్వాజ్ వివాదం లేపితే అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట.
తాను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే బిజెపిలో చేరానని, వివాదం సృష్టించడానికి కాదని శిరీష్ భరద్వాజ్ చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సామాజిక సేవ ద్వారా, ఉత్తమ రాజకీయాల ద్వారా తానేమిటో నిరూపించుకోవాలనేది తన ప్రయత్నమని, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి ప్రయోజనం పొందాలని అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు.
తనకు రాజకీయాల పట్ల కూడా ఆసక్తి లేదని, అయితే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చానని, మోడీ సిద్ధాంతాలు నచ్చి వచ్చానని శిరీష్ చెబుతున్నట్లు సమాచారం.