సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు: ఘర్షణలు, కుమ్మక్కులు
కాంగ్రెస్ కార్యకర్తలు తమ మద్దతుదారుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సర్పంచ్ అభ్యర్థి స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో అధికారులు రాలేదంటూ శనివారం ఉదయం నామినేషన్ కేంద్రం వద్ద సర్పంచ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగినుంది.
వరంగల్ జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లిలో నామినేషన్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్కు నేడు చివరి రోజు కావడంతో కేంద్రం వద్ద అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుచేయడానికి కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు.
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో నామినేష్ కేంద్రం వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రాజారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొంత మంది యువకులు పత్రాలను దౌర్జన్యంగా లాక్కుని వెళ్లారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పత్రాలు లాక్కెళ్లినవారిని కాంగ్రెసు కార్యకర్తలుగా అనుమానిస్తున్నారు.
కాగా, కృష్ణా, గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల కార్యకర్తలు కుమ్మక్కయ్యారని వార్తలు వస్తున్నాయి. కైకలూరులో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా అప్పారావును పెట్టినట్లు సమాచారం. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్లలో కూడా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినట్లు చెబుతున్నారు.