ఉత్తరాఖండ్: శిథిలాల తొలగింపుకు వాతావరణం గండి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదల కారణంగా కేదార్నాథ్ కకావికలమైన విషయం తెలిసిందే. ఆలయ పరిసర ప్రాంతాల్లో శిథిలాలను 61 మంది బృందంతో కూడిన సభ్యులు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలకు ఆదివారం వాతావరణం గండి కొడుతొంది. ఇక్కడి శిథిలాలను తొలగించడమే కాకుండా, రాంబాట నుండి హిమాలయన్ దేవాలయానికి గల రహదారిలోను చర్యలు చేపట్టారు.
హెలిప్యాడ్ నుండి దేవాలయానికి మధ్యన గల కెనాల్ వద్ద తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించనున్నారు. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల ఆలయం వద్ద ఉన్న శిథిలాలను తొలగించే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందని రుద్రప్రయాగ పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు.
కాగా, వరదలతో మేటవేసిన బురద.. ఆ బురద కింద సమాధి అయిపోయిన శవాలు.. ఇదీ కేదార్నాథ్లో ప్రస్తుత దృశ్యం. ఇదే విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు నివేదించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ ఎమ్వై ఇక్బాల్ల ధర్మాసనం ఎదుట శనివారం ఉత్తరాఖండ్ అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు.
కేదార్నాథ్ సహాయ కార్యక్రమాలను గురించి శనివారం వివరించారు. సహాయ పునరావాస పనులు పూర్తి అయ్యాయని సుప్రీం కోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నివేదించగా, సమగ్ర వివరాలతో స్పందించాలని కోర్టు ఈ నెల మూడో తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే.