శంకర్రావుపై పోలీసుల హత్యాయత్నం: సుస్మిత ఆరోపణ
తనను, తన తండ్రిని చంపడానికి కుట్ర జరుగుతోందని, తమకు రక్షణ కల్పించాలని సుస్మిత కోరింది. శంకర రావు ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే వారు హత్యాయత్నం చేయబోయారని ఆమె ఆరోపించారు.
సుస్మిత చెప్పిన ప్రకారం... రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఐసియులో ఉన్న శంకర రావు గదికి వారు వెళ్లారు. ఏదో అలికిడి కావడంతో తన తండ్రి అలర్ట్ అయ్యారని, వెంటనే తన తండ్రి నర్సు కోసం కేకలు వేశారని, దాంతో వచ్చినతను పారిపోయాడని చెప్పారు. తన తండ్రి తనను పిలిచి విషయం చెప్పారన్నారు.
తాను ఐసియు వద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఎవరో కూర్చొని ఉండటం చూశానని, అందులో ముగ్గురు పోలీసులు అని తనకు తెలుసునని, నాలుగో వ్యక్తి మాత్రం కొత్తవాడని, అతని వద్దకు వెళ్లి తాను అడగగా.. తాను పోలీసునని చెప్పారని, ఐటెండిటీ కార్డు చూపించాడని సుస్మిత తెలిపారు.
తాను ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు, తన తండ్రికి రక్షణ కావాలన్నారు. సిసిటివిల్లో చూస్తే వచ్చిన వారెవరో తెలుస్తుందన్నారు. అయితే వారు డ్యూటీలో ఉన్న పోలీసు వారని, సుస్మిత అపార్థం చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.