లాస్ట్ డే: టెలిగ్రామ్ కోసం క్యూ, చివరిది రాహుల్ గాంధీకి
న్యూఢిల్లీ: నూటా అరవై మూడేళ్ల పాటు సేవలు అందించిన టెలిగ్రామ్ ఆదివారం రాత్రితో చరిత్ర పుటల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. టెలిగ్రామ్ పంపించేందుకు చివరి రోజు కావడంతో చాలామంది టెలిగ్రామ్ సెంటర్ల వద్ద పంపించాలనే కుతూహలంతో క్యూ కట్టారు. అది చరిత్ర పుటల్లోకి ఎక్కనున్న నేపథ్యంలో ఆసక్తి కోసం చాలామంది టెలిగ్రామ్ పంపించేందుకు వచ్చారు.
అర్ధరాత్రి వరకు తమ ఆప్లులకు పలువురు టెలిగ్రామ్ పంపించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో చివరి టెలిగ్రామ్వు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఓ వ్యక్తి పంపాడు. జన్పథ్లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో అశ్వని మిశ్రా అనే వ్యక్తి రాహుల్తో పాటు డిడి న్యూస్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎం ఖాన్కు పంపించాడు.
రాత్రి పదకొండు గంటల నలభై అయిదు నిమిషాలకు దీనిని పంపించాడు. ఆఖరు రోజు రూ.68,837 కలెక్ట్ అయింది. ఆదివారం మొత్తం బుకింగ్స్ 2,197గా ఉన్నాయి. టెలిగ్రామ్ పంపించేందుకు యువత కూడా ఆసక్తి కనబర్చారు. చాలామంది మొదటిసారి పంపించారు.
దేశవ్యాప్తంగా 75 చోట్ల ఉన్న టెలిగ్రామ్ ఆఫీసుల్లోని యంత్రాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం టెలిగ్రామ్ విభాగంలో ఉన్న దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను బిఎస్ఎన్ఎల్ ఇతర సేవలకు ఉపయోగించుకోనుంది. టెలిగ్రామ్ ఒకప్పుడు తపాలా పరిధిలో కొనసాగినా.. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ పరిధిలోకి వచ్చింది. ఆదివారం చరిత్రపుటల్లోకి ఎక్కింది.